🎯 ఆరాధన అనగాఏమి ?
(రెండవ భాగము)
👑 ఆరవ ఆరాధన : ప్రకటన 5:13 “ అంతట పరలోకమండును భూలోకమందును భూమిక్రిందను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును – సింహాసనాసీనుడైయున్న వానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని.”
పైన చదివిన ఆరాధన దిక్కులు పిక్కటిల్లేలా చేసే ఆ పరలోకపు ఆరాధన అటు పరలోకంలోనూ ఇటు భూమిమీదను భూమిక్రిందను సముద్రంలోను సృష్టింపబడిన దేదైనను ఆరాధించక మానలేదు. సృష్టింపబడిన ప్రతి సృష్టము తన సృష్టికర్తను ఆయన ఘనతా మహిమ ప్రభావములను స్మరించి స్తుతించుట ఈ దర్శనంలో ప్రకటన గ్రంథకర్త చూసాడు. అది మన కన్నులకు ఆశ్చర్యమే, మన జ్ఞానమునకు మించినదే.
👑 ఏడవ ఆరాధన : ప్రకటన 6:10 “ వారు – నాధా, సత్యస్వరుపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భునివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి.”
తమ ప్రాణములు అర్పించిన హతసాక్షులైన వారి ఆత్మల స్వరం, అనేక ప్రవక్తలను నీతిమంతులను అనగా వాక్యము కొరకును ప్రభువు కొరకును సమర్పించుకొనిన వారిని బలిగొన్న ఈ భూలోకానికి త్వరగా తీర్పు తీర్చమని న్యాయాధిపతియైన దేవుని ఆ యాత్మలు అడుగుతున్నాయి. అవి సంభోదిస్తూ యోగ్యుడైన ఆ దేవుడే ఆయన నాధుడని, ఆయనే సత్యమునకు మరో రూపమని పరిశుద్ధుడని ప్రభువును ఘనపరచుట గమనించాలి.
👑 ఎనిమిదవ ఆరాధన : ప్రకటన 7:9,10 “ ... సింహాసనము యెదుటను గొఱ్ఱెపిల్ల ఎదుటను నిలువబడి – సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశభ్ధముతో ఎలుగెత్తి చెప్పిరి.”
7వ అధ్యా లో తమ నుదిటిపై దేవుని నామం ముద్రింపబడినవారిని చూస్తాము. ఇశ్రాయేలు 12 గోత్రముల నుండి వచ్చిన 1,44,000 మందితో కలిసి ఎత్తబడినవారి గుంపు ఆరాధించటం గమనార్హం. పరిశుద్ధులు ఒక లెక్కింపజాలని సమూహంగా ఉన్నారు. వారంతా క్రీస్తు రక్తంలో కడుగబడి రక్షణానుభవం కలిగిన వారుగా కనిపిస్తున్నారు. పరలోకంలో వారికి ఇచ్చిన ఆ ప్రవేశమును బట్టి తమ రక్షకునికి స్తోత్రమని ఎలుగెత్తి చెప్పిన ఆ మహా శబ్ధం ఒక వర్ణంచలేని ఆరాధన. ఆది అనేక భాషలలో అనేక స్వరములతో ఏక కంఠంగా ఏక ఆత్మతో సాగుతున్న ఒక అద్భుత ఆరాధన.
👑 తోమ్మిదవ ఆరాధన : ప్రకటన 7:11, 12 “దేవదూతలందరును సింహాసనము చుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవుల చుట్టును నిలువబడి యుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి – ఆమేన్: యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి: ఆమేన్”
వీరు పరలోకమందలి ఆలయంలో ఆరాధించువారు. వారు శ్రమల కొలిమిలో పరీక్షింపబడినవారు. గొఱ్ఱెపిల్ల రక్తములో ఉదుకబడిన తెల్లని వస్త్రములు ధరించినవారు. శ్రేష్ఠమైన వారి ఆరాధన వారిని నిత్యమూ ఆ గొఱ్ఱెపిల్ల కాపరత్వములో ఉంటూ జీవజలముల బుగ్గలకు చేరువవుతూ ఉంటారు. వారు నిత్యానందభరితులై కృతజ్ఞతాపూర్వక ఆరాధన అర్పించువారు.
👑 పదియవ ఆరాధన : ప్రకటన 11:16,17 “అంతట దేవుని ఎదుట సింహాసనాసినులగు ఆ ఇరువది నలుగురు పెద్దలు సాస్టాంగపడి దేవునికి నమస్కారము చేసి – వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించు చున్నాము.”
రాజైన యేసుక్రీస్తుకు సర్వ రాజ్యాధికారము ఇవ్వబడగానె పరలోక రాజ్యము ఈలోక రాజ్యము క్రీస్తు రాజ్యమైపోయాయి. ఇక యుగయుగములవరకు ఆయనే రారాజు. ఆయన రాజ్యము అంతములేనిది. సర్వకాలములకు ఆయనే ప్రభువు. ఆ నిత్యరాజ్యంలో అనునిత్యమూ వారి ఆరాధనా అంతములేనిదై యుండును.
👑 పదకొండవ ఆరాధన : ప్రకటన 15:3,4 “వారు – ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి: యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి: ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచ బడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారము చెసెదరని చెప్పుచు... పాడుచున్నారు”
సమయము కొంచమే అని గర్జించు సింహమువలె తిరుగులాడుచున్న ఆ మృగమునకు లోబడక దాని ప్రతిమకు నమస్కరింపక జయించినవారు జయశీలుడగు క్రీస్తుని కిర్తనలతోను స్తుతిగీతములతోను ఆరాధిస్తున్నారు.
👑పదునెండవ ఆరాధన : ప్రకటన 19:1,4,6-7 “... గొప్పస్వరము – ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును: ... రెండవసారి వారు – ప్రభువును స్తుతించుడి అనిరి”. “ఆ ఇరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులును సాగిలపడి – ఆమేన్, ప్రభువుని స్తుతించుడి”. “ఒక స్వరము – సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఎలుచున్నాడు; ఆయనను స్తుతించుడి”.
ఆత్మదేవుని ఆత్మతో చేసే యదార్ధమైన ఆరాధన ఎలా వుంటుందో పరలోకంలో జరుగుతున్న ఈ ఆరాధనల ద్వారా తెలుసుకొనగలము. ప్రతి విశ్వాసి అట్టి స్వఛ్ఛమైన ఆరాధన నేర్చుకోవాలి, చేయాలి. ఆమేన్.