*ఆచార్య ఆరార్కే మూర్తి గారి సాక్ష్యం*
మా ఊరు గోవిందాపురం, గుంటూరు జిల్లా, నరసారావు పేట తాలుకా; పుట్టి పెరిగింది సాంప్రదాయకమైన శ్రోత్రీయ బ్రాహ్మణ కుటుంబము. మా నాన్న గారి పేరు రంగనాయక శర్మ, మా తల్లి గారి పేరు కామేశ్వరమ్మ, మేము ఆరుగురు అన్నదమ్ములం , అందరిలో నేను …చిన్నవాడిని .
పూర్తి పేరు రాయసం రాధాకృష్ణ మూర్తి, హరితస గోత్రం, పూర్వీకులు వైశ్య దేవం, అగ్నిహోత్ర పూజ చేసేవారు, ఇలావేల్పులు వీరభద్రుడు, భద్రకాళి.
చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాము , మధ్య తరగతి కుటుంబము, ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు. మా నాన్న గారికి కోటప్ప కొండ ధర్మ కర్తృత్వం ఉండేది. కవుల కుటుంబము, మా పూర్వికులు రాజుల ఆస్థానాలలో కవులు, లేఖికులు.
నా బాల్యం అంతా గోవింధాపురంలోనే గడిచిపోయింది. పూజ పునఃస్కారాలు ఎక్కువగా చేస్తుండేవాడిని , ఆంజనేయుడు, శివుడు, వీరభద్రుడు, జనార్ధనుడు గ్రామ దేవతలు.
మా అమ్మ గారికి చదవను రాయను రాదు, నాన్న గారి ద్వారా ఆమెకు శ్రుత పాండిత్యము అబ్బింది. ఆమె ఆచారము, మడి, దేవతార్చన, జపతపాలు, ఏకాదశి ఉపవాసాలు, ప్రతి ఏట పెట్టె అబ్దికాలు, తద్దినాలు, వీటితో సతమత మైపోతూ ఉండేది.
మా నాన్న గారు సంస్కృత పండితుడు, ధ్యాన శ్లోకాలు, భగవద్గీత, భాష్యాలు వల్లిస్తూ ఉండేవారు.
అతి కష్టం మీద నరసారావు పేట లో హై స్కూల్ చదువు ముగించుకుని , గుంటూరు లో ఆంధ్ర కళాశాలకు పై చదువులకు వెళ్ళాను , ఆరోగ్యం బావుండక రెండు సం.లు చదువుకు అంతరాయం కలిగింది.
చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ , తెలుగు భాషలలో అభిరుచి ఎక్కువ. తెలుగులో కవిత్వం రాసేవాడిని , ఏవేవో పద్యాలు పాటలు రాసి, తోటి విద్యార్థులకు వినిపించేవాడిని , తరగతిలో ఉత్తమ విద్యార్ధి అనే పేరుంది. బాగా అల్లరి చేసేవాడిని .
రాజకీయాలలో కూడ తలదూర్చి క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో స్నేహితులతో కలసి వాల్ పోస్టర్లు అంటించాను .
చిన్నప్పటి నుండి బైబిలు అన్నా, క్రైస్తవులు అన్నా చాల తేలిక అబిప్రాయం ఉండేది, ఇది విదేశీ మతం, మతం లేని వారికి ఇదొకటి దొరికింది, ఇదొక హాస్యాస్పదమయిన మతమని హేలనచేసే వాడిని . గ్రామ బోధకులకు అడ్డ దిడ్డమైన ప్రశ్నలు వేసి సతాయించేవాడిని . చిన్నప్పటి నుండి వీరు ఊరి బయటే ఉండేవారు, వీరు తప్ప ఈ మతాన్ని ఇంకెవరు చేపట్టరని వ్యాఖ్యానించే వారు. మత గ్రంధాలు ఎన్నో ఉన్నాయి, వాటిలో బైబిలు చౌకబారయినది, అది చదవాల్సిన అవసరమే లేదనుకున్నాను . ఇలాంటి మనో భావాలతో పెరిగాను . చిన్నప్పటి నుండి అతి దేవతా భక్తిలో పెరిగాను , శంకరాచార్యుని స్తోత్ర శ్లోకాలు కంటత వచ్చు.
గోవిందపురంలో నంబి కుటుంబం ఉండేది. ఎక్కువగా వారి ఇంట్లోనే ఉండేవాడిని , రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కొన్నాలు ఉద్యోగం చేశాను .అదీ వదిలేశాను , ఎక్కడ నిలకడ లేదు, మానసికంగా అసంతృప్తి, ఆత్మ శాంతి లేదు, శివానంద సరస్వతి రచించిన వేదాంత గ్రంధాలు ఎన్నో చదివాను
నేను నరసారావు పేట హై స్కూల్ లో చదువుకుంటున్నప్పుడు నతానియేలు అనే క్రైస్తవుల అబ్బాయి తో స్నేహం అయింది. అతనికి కవిత్వం పిచ్చి ఎక్కువ, యేసు ప్రభువు చెప్పిన ఉపమానాలు, ప్రభోధాలను పద్యాల్లో రాసి తెచ్చేవాడు, నేను సరి చేసే వాడిని, నాకు నతానియేలు మంచి స్నేహితుడు కాని అతని మతం – నాకు అసహ్యం. అయినా అతని ఎదుట నేను విమర్శించేవాడిని కాదు.
నేను ఇంటర్ చదువుతూ మానేసి, ఆరోగ్య కారణాలను బట్టి కాకినాడలో మా అన్నయ్య దగ్గరకు వెళ్లాను, ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసేవాడు. మా పెద్దక్కయ్య బాల్య వితంతువు మా అన్నయ్య దగ్గరే ఉండేది. నేనూ అక్కడే ఉంటుండగా నేను ఊహించని ఒక సంఘటన అక్కడ జరిగింది. సూత్రాల శేషగిరి రావు గారని ఒకాయన మా ఇంటికి వచ్చాడు, ఆయన మధ్వ బ్రాహ్మణుడు. విదేశీయులకు తెలుగు భాష నేర్పుతాడు. పాశ్చాత్య మిషనరీ ల మధ్య ఆయనకు మంచి పేరుంది. గొప్ప ఉపాధ్యాయుడు.
మాటల సందర్బములో శేషగిరి రావు నా విషయం ప్రస్తావించాడు, తనకు అసిస్టెంట్ గా మిషనరీలకు తెలుగు నేర్పేందుకు నన్ను పెట్టుకుంటానన్నాడు. నేను సరే అన్నాను. మా అన్నయ్య ఒప్పుకున్నాడు, తెల్ల దొరలకు తెలుగు నేర్పుతూ నేను కాకినాడ, రామచంద్రాపురం, ఊటి, కొడైకెనాల్, ప్రాంతాలన్నీ తిరిగాను, వారికి తెలుగు నేర్పడం నా పని. వ్యాకరణం నేర్పాలి, తెలుగులో వారితో సంభాషణ చేస్తూ ఉండాలి. యోహాను సువార్త నాకివ్వబడిన పుస్తకము.
ఆ పుస్తకము చదవడము అంతగా నాకు ఇష్టము లేకపోయినప్పటికీ ఉద్యోగము నిమిత్తము చదివాను, అందులోని భాష విలక్షణం గా ఉన్నట్లు మొదట తోచినది. ఇంగ్లిష్ లో యోహాను సువార్త చదివి దానిని తెలుగులో సరిపోల్చుకున్నాను, ప్రతి వచనము చదివి, భాషా పరంగా ప్రతి వచనము విడదీసి, వ్యాకరణము నేర్పుతూ ఉంటే, దొరలూ ఆశ్చర్య పోయేవారు. ఒక దొరనాతో అన్నాడు, యువకుడివి మంచి అనుభవము ఉన్న ఉపాద్యాయుడిలాగ యోహాను సువార్త లోని పాటాలు మాకు నేర్పుతున్నావు. అభివృద్ది లోకి వస్తావు, అన్నాడు, మరో దొర, నేను ఏకాంతంగా ఉన్నప్పుడు, ” నీవు చదివి చెబుతున్నావే, ఈ యోహాను సువార్తనే గనుక నీవు నమ్మితే, తెలుగు దేశంలో పెద్ద బోధకుడివి అవుతావు, దేవుడు నిన్ను దీవిస్తాడు” అని అన్నాడు.
కొందరు దొరలు నిన్ను సెమినరీ కి పంపిస్తాము వెళ్తావా అని అడిగారు, నేను నవ్వి చివరికి నేను క్రైస్తవ బోధకుడినా అయ్యేది అని అన్నాను. అయితే దేవుని సంకల్పంలో నేను బోధకుడినే. మరో దొర ప్రవచనము చెప్పాడు కూడ. ఒకానొక రోజు న సువార్తను చెప్పే గొప్ప ప్రసంగీకుడివి అవుతావు. నిజం ఆ ప్రవచనమే నెరవేరింది.
యోహాను సువార్త ఎన్నో వందల సార్లు చదివాను, మిషనరీల చేత చదివించాను, అందులో ఏ అధ్యాయములో ఏముందో నాకు తెలుసు. కాని యేసు క్రీస్తు నా రక్షకుడు కాడు, ప్రభువు కాడు. క్రైస్తవ్యం నాకు అక్కర లేదు, క్రీస్తుకు నేను వ్యతిరేకి నేమి కాను, అనే వేదాంతం కల్పించుకున్నాను. క్రీస్తును నా హృదయంలోకి రానివ్వకుండా నా ఊహలను సమర్దించుకోడానికి ఎన్నెన్నో తార్కిక వాదనలను తయారు చేసుకున్నాను, యేసు క్రీస్తు ఒక్కడే దేవుడు కాడు, ఏ దేవుడిని నమ్మిన ఒక్కటే, దేవుళ్ళ మధ్య పోటి ఏమిటి?
ఏ దేవుడు గొప్ప వాడు అని మనకెందుకీ వాదం? అందరూ ఒక్కటే అనుకుంటే సరిపోతుందిలే అనుకున్నాను, మతాల మార్పిడి తప్పు, అని మిషనరీ లతో వాదించాను, దేవుని అవతారాలు ఎన్నెన్నో, యేసు క్రీస్తు ఒక అవతారం అనేంత వరకు వచ్చాను. మిషనరీలు నన్నెంతో ప్రేమించేవారు, నేను ఎంత విమర్శించిన ఏమి అనే వారు కారు.
వారి దగ్గర ఉన్న పుస్తకాలెన్నో చదివాను, తద్వారా జ్ఞానం వృద్ది అవుతుంది అనుకున్నాను. యేసుని అంగీకరించి క్రైస్తవుడనవుతానని నేను కలలో కూడ ఊహించలేదు. కాని దేవుని సంకల్పము నా పట్ల వేరే విధముగా ఉన్నది. మిషనరీలు వేల కొలది మైళ్ళు వచ్చి భాష నేర్చుకుని ఇక్కడి ప్రజలకు ఏసుక్రీస్తు సువార్త బోదిస్తున్నారే, వీరి దీక్ష ప్రసంశనీయం అనుకున్నాను. అప్పుడప్పుడు నాకనిపించేది , ఎందుకని వీరు ఊరి బయట నిమ్న జాతుల మధ్యే ఉండిపోతారు. అది నాకు అర్థం కాలేదు. యేసు అందరికి ప్రభువంటూ నిమ్న కులస్తుల మధ్యే ఉండి, పని చేస్తారేమిటి? అని అడగాలనిపించేది కాని ఎవరిని ఆ ప్రశ్న అడగలేదు.
నాలో అనిర్వచనీయమైన సంఘటన నేను మహబూబ్ నగర్ లో ఉన్నప్పుడు మొదలయింది. యచ్ జి క్రాన్ అనే మిషినరి తో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన నేను ప్రతి రోజు గంటల తరబడి ఆద్యాత్మిక విషయాలు చర్చించుకునే వాళ్ళం. ఆయనతో నా సంభాషణ నాకు గొప్ప ఆశీర్వాదకరంగా పరిణమించింది. జటిలమైన థియాలజి సత్యాలు కరతలామలకం అయ్యాయి.
ఈ సంధర్బములో నేనో మాట చెప్పాలి, *బైబిలు లో తప్పులు పట్టుకుందామని చదివాను, బైబిలే నన్ను చదివి నాలో తప్పులు పట్టుకుంది*.
బైబిలు మామూలు పుస్తకమయితేగా అది దైవావేషం వలన కలిగిన లేఖనము, దేవుని ముఖ నిర్ఘతమయిన మాట జీవప్రధం. ఆద్యాత్మిక శస్త్ర చికిత్స సాధనం.
మిషనరీలకెందరికో తెలుగు నేర్పాను, వారిని తెలుగు పరీక్షలకు సిద్దపరిచాను, వారికి సంభాషణ, వ్యాకరణం నేర్పాను, యోహాను సువార్త లోని సారాంశమంత వారికి నేర్పి, వారి చేత మాట్లాడించాను. మిషను కాంపౌండ్ లోనే కాపురమున్నాము.
ఆ కాంపౌండ్ లో ఒక మిషనరీ అతని చుట్టూరా కొన్ని క్రైస్తవ కుటుంబాలు, ఒక బడి, ఒక గుడి, ఆసుపత్రి, మిషనరీ చుట్టూ ఉపగ్రహాలు కొన్ని తిరుగుతూ ఉంటాయి. మిషను కాంపౌండ్ రాజకీయాలు ఒక పట్టాన ఎవరికీ అంతుపట్టవు. మిషనరీ ఆసరా చూసుకుని కొందరు అధికారం చెలాయించడం,ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం, ఇదంతా చూస్తుంటే నాకు అంత అయోమయం గా అనిపించింది. అయినా క్రైస్తవ సందేశం నా హృదయాన్ని ఆకట్టుకుంది. క్రైస్తవులను సానుభూతితో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను.
పరాయి దేశం నుంచి వచ్చిన మిషనరీ ఊరికి దూరంగా ఒక బంగ్లా కట్టుకుంటాడు, అతడికి పనివారు కావాలి, వంట పని తోట పని చేయడానికి కొన్ని కుంటుంబాలు కాంపౌండ్ లో నివాసమేర్పరచుకుని ఉంటాయి. తరువాత మిషన్ సంస్తలో పని చేసే ఉపాద్యాయులు, నర్సులు, డాక్టర్లు, అదే కాంపౌండ్ లో కాపురముంటారు. నేను వారి మద్య కాపురమున్నాను.
*వాక్య పటన*:
నారాయణపేటలో కొన్నాళ్ళు కుటుంబముతో ఉన్నాను, దేవుని వాక్యమనే బైబిలును సునిశితము గా పటించాను. ఆలోచిస్తూ ఉన్నాను, ఎన్నో వ్యాఖ్యానాలు చూశాను, బైబిలు సత్యం నన్ను ముద్దాయి గా నిలబెట్టింది. బైబిలు మామూలు పుస్తకము కాదని, అందులో శక్తి భరితమయిన సత్యం ఉన్నదని గ్రహించడానికి కొన్ని సం.ల కాలం పట్టింది. నారాయణ పేటలో క్రాన్ అనే మిషనరికి తెలుగు నేర్పుతున్నాను, ఆ వూరు ఆర్య సమాజ కేంద్రం. అక్కడ ఉంటూ ఉండగా నాలో అనిర్వచనీయమైన పరివర్తన అంచెల వారిగా వచ్చింది.
క్రైస్తవుల బలహీనతలను విమర్శించే నాలో వారి పట్ల ప్రేమ సానుభూతి కలగ సాగాయి. గ్రామీణ బోధకులతో గంటల తరబడి గడిపేవాడిని. వారు చెప్పేదంతా ఓపికగా వినేవాడిని. వారికి నాకు ఘాడ స్నేహం ఏర్పడింది. వారి అమాయకతను క్రీస్తు నందలి ప్రేమను గుర్తించాను. నైతికంగా బలహీనులే అయినా క్రీస్తు నీతిని నమ్ముకున్న ఈ ప్రజలపై నాకు ఆదరాభిమానాలు కలగ జొచ్చాయి.
*సాతాను చర్యలు*
రెండు మూడు సార్లు సాతాను క్రీస్తు పట్ల లేని పోనీ అపోహలు పుట్టించాడు, నేను వెళ్లి పోయేటట్లు చేశాడు, అయినా మళ్ళి వచ్చేశాను, నా అంతరాంతరాలలో తీవ్ర సంఘర్షణ మొదలయింది. యేసు ప్రభువులోని అయస్కాంతపు ఆకర్షణ ఒక చెంప, నా బందుమిత్రాదులపై మమకారం ఒక చెంప. ఈ విధం గా నాలో ద్వంద్వ యుద్ధం మొదలయింది. యేసు క్రీస్తు నన్ను పూర్తిగా కోరుతున్నాడు. నేనాయనకు సంపూర్ణముగా వశమయిపోతే నా బంధువులకు దూరమయి పోతాను, ఆటా, ఇటా, ఎటూ తోచని పరిస్తితి ఏర్పడింది. ఒక రోజు ఊరి బయటికి వ్యాహాల్లి గా ఓ గట్టు పైకి వెళ్లాను, ఎంతో సేపు అక్కడే కూర్చుడి పోయాను. తీవ్రంగా తలపోశాను, క్రీస్తును అంగీకరిస్తే వచ్చే నష్టాలు, నిరాకరిస్తే వచ్చే కష్టాలు అంచనా వేసుకున్నాను.
*బేరీజు*
బందువులు బలగము నన్ను హేళన చేస్తారు. నిమ్న జాతులలో కలిసి పోయానని ఆడిపోసుకుంటారు. వారితో కలిసి పోతే తప్పేమిటి?. రాజకీయాలలో నయితే ఇలాంటి వాటికి మంచి పేరు వస్తుంది. కాని క్రీస్టు విషయములో ఇది ఒక నిందగా పరిణమిస్తుంది. ఎందఱో రాజకీయ నాయకులు నిమ్న జాతులలో తిరిగి గొప్ప నాయకులయ్యారు, కాని క్రీస్తు కోసం ఇది నాకు మోయవలసిన శిలువ అయింది. అయితే మటుకేం క్రీస్తు కోసం నిమ్న జాతి వాణ్ణే అవుతాను. అందరు నన్ను అలాగే విమర్శించనియ్యి. అదే నాకు ఆత్మా నందం , ఆత్మ శాంతి.
తర్వాత యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించాను
*-RRK MURTHY*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి